⏩::రాఘవాపురం క్రాస్ రోడ్డు నుంచి సిరికొండ వరకు అడుగుకో గుంత
⏩::రోడ్డుకు ఇరువైపుల పెరిగిన చెట్లు
⏩::ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
⏩::మరమ్మతులు చేయాలని ప్రజల డిమాండ్
మీ న్యూస్ ప్రతినిధి
సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం క్రాస్ రోడ్డు నుంచి సిరికొండ వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. అడుగుకో గుంతతో అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు వెంట పలు తండల ప్రజలు నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. వందలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డుపై గుంతలు పడి, కంకర తేలాయి.రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఉండటం, కంకర తేలి ఉండటంతో వాహనాలు చెడిపోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ రహదారిపై ఒకటి, రెండు సార్లు వెళితే నడుమనొప్పులు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. కొన్ని చోట్ల రోడ్డుకు ఇరువైపులా చెట్టు పెరిగాయి.ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఇబ్బందిపడుతున్నారు. ద్విచక్రవాహనదారులు ఈ గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. సింగిల్ రోడ్డు వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో రోడ్డు మార్గంగుండా వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.వర్షాకాలం ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం.వరద నీరు గుంతల్లో నిలిచి ప్రయాణికులు కిందపడుతున్నారు. సంబంధితశాఖ అధికారులు రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.