schedule Wednesday, June 17, 2026

calendar_today April 2, 2024
person meenewstelugu

మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయం..! -కుటుంబ పాలన పార్టీలను ఓడించాలి -తాండూరు ప్రాంతంలో ప్రజా ఆశీర్వాద యాత్ర సక్సెస్ -చేవెళ్లలో ఈసారి ఎగిరేది కాషాయ జెండా పక్కా..! -మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

దీక్షతెలుగున్యూస్, తాండూరు :

ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానమంత్రి కావడం ఖాయమని చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేపట్టిన ప్రజా ఆశీర్వాదయాత్ర 6వ రోజుకు చేరుకుంది. మంగళవారం ప్రజా ఆశీర్వాద యాత్రను తాండూరు మండలం కరన్ కోట్, మల్కాపూర్,కోట్ బాష్పల్లి, జింగుర్తి, గౌతాపూర్, చెంగోల్,ఇతర గ్రామాలలో నిర్వహించిన యాత్ర విజయవంతం అయింది. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి పథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కరోనా సమయంలో కోట్లాది మంది భారతీయులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. దేశంలో విద్యా వైద్యం కోసం బిజెపి పాలిత రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తున్నాయని.. కానీ గతంలో పాలించిన బిఆర్ఎస్ తెలంగాణలో విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను తన గొప్పలుగా చెప్పుకుంటూ కెసిఆర్ పాలించారని ఆయన విమర్శించారు.

కుటుంబ పాలనలు అంతం చేద్దాం..

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల డీఎన్‌ఏ ఒక్కటే అని, ఆ రెండూ కుటుంబ పార్టీలే అయినందున వాటిని ఓడించాలని ఆయన అన్నారు. నెహ్రూ నుంచి రాహుల్‌ వరకు కాంగ్రెస్‌లో కుటుంబ పాలనే సాగుతోందని, బీఆర్‌ఎస్‌లో సైతం ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ రెండు పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కొత్త ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.బంగారు తెలంగాణ ఏమో కాని తాగుబోతుల తెలంగాణగా సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని మార్చారన్నారు.

దేశ భద్రత కోసం.. దేశ భవిష్యత్తు కోసం.. మోడీ సర్కార్ రావాలి..

ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంపట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారని మరోసారి నరేంద్ర మోదీని ప్రధాన మంత్రిగా చేసేందుకు ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని విశ్వాసం వ్యక్తం చేశారు.మన పిల్లల కోసం, దేశం కోసం, దేశ భవిష్యత్ కోసం మరోసారి నరేంద్ర మోదీని ప్రధాన మంత్రిగా చేసేందుకు ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం.. దేశ భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా చేవెళ్ల బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కొండా పిలుపునిచ్చారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో బిజెపి జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి తోపాటు సీనియర్ నాయకులు రమేష్, పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు, రజనీకాంత్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.